కర్నూల్లో విషాదం: తేనేటీగల దాడిలో ఇంజనీర్ భాను ప్రకాష్ మృతి
తేనేటీగల దాడిలో నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న డివిజనల్ ఇంజనీర్ భాను ప్రకాష్ మృతి చెందారు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
కర్నూల్: తేనేటీగల దాడిలో నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న డివిజనల్ ఇంజనీర్ భాను ప్రకాష్ మృతి చెందారు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
కర్నూల్ జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యేలేటర్ వద్ద ఎస్ఆర్బీసీ గేట్ల తనిఖీ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. తేనేటీగలు దాడి చేయడంతో భాను ప్రకాష్ సహా మరో 10 మంది గాయపడ్డారు.
భాను ప్రకాష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించాడు. తేనేటీగల దాడిలో గాయపడిన వారు కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేనేటీగలు పెద్ద ఎత్తున దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.తేనేటీగల దాడిలో మరణించడం అరుదుగా సంభవిస్తోందని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడ తేనేటీగల దాడిలో పలువురు గాయపడ్డారు. అయితే మరణించడం అరుదుగా సాగుతోంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుండి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. తేనేటీగల దాడికి ముందు ఏం జరిగిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.