సీఎస్కు ఉద్యమ నోటీసులు ఇచ్చిన ఉద్యోగ నేతలు.. చాయ్ బిస్కెట్ మీటింగ్లతో రాజీపడమన్న బొప్పరాజు
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం సీఎస్కు వినతి పత్రం ఇచ్చారు అమరావతి జేఏసీ నేతలు .
డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసులు అందజేశారు. ఉద్యోగుల ఆర్ధిక, ఇతర సమస్యల పరిష్కారం కోసమే తాము ఆందోళన చేస్తున్నట్లు వారు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9న ఉద్యమం ప్రారంభిస్తామని వారు తెలిపారు.
ALso Read: జగన్ సర్కార్కు షాక్.. ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు, కార్యాచరణ ఇదే
అనంతరం అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత సెల్ డౌన్, పెన్ డౌన్, లంచ్ బ్రేక్లో ఆందోళనలు చేపడుతున్నట్లు బొప్పరాలు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని ఆయన వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలకు వెళ్లేది లేదని ఆయన హెచ్చరించారు.
ఉద్యమ కార్యాచరణ ఇదే :
- వచ్చే నెల 21 నుంచి పెన్ డౌన్
- మార్చి 9 న నల్ల బ్యాడ్జీల తో నిరసన.
- మార్చి 13, 14వ తేదీల్లో భోజన విరమణ సమయంలో ఆందోళనలు
- మార్చి 21న సెల్ ఫోన్ డౌన్
- మార్చి 24న హెచ్వోడీల ఎదుట ఆందోళన
- మార్చి 27న కోవిడ్ లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరామర్శ
- ఏప్రిల్ 3వ తేదీన గ్రీవిన్స్ లో కలెక్టర్లక వినతిపత్రం అందజేత