గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేసినట్టుగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేసినట్టుగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల కోసం 10 లక్షల 56 వేలకు పైగా ధరఖాస్తులు వచ్చినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 16,208 ఖాళీ పోస్టుల కోసం 10 లక్షల 56 వేల 931 మంది ధరఖాస్తు చేసుకొన్నారని ఆయన చెప్పారు.
ఈ పోస్టుల కోసం ధరఖాస్తు చేసుకొనే వారికి ఈ నెల 20వ తేదీ నుండి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఈ పరీక్షల ఇన్విజిలేషన్ నిర్వహించే వారికి పీపీఈ కిట్స్ ఇస్తామన్నారు.కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయి. గత ఏడాది ప్రభుత్వం మొత్తం 1,26,728 ఉద్యోగాలకు పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, విజయవంతగా నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. మొదటి విడత నిర్వహించిన పరీక్షల ద్వారా 1,10,520 ఉద్యోగాలను భర్తీ చేసినట్టుగా చెప్పారు. ఇంకా గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో 16,208 ఖాళీ పోస్టులు మిగిలిపోయినట్టుగా ఆయన తెలిపారు.
ఒఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు ఉంచడానికి 13 జిల్లాల హెడ్ క్వార్టర్లలో స్ట్రాంగ్ రూంల ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించటానికి రాష్ట్ర వ్యాప్తంగా 806 రూట్లను ఏర్పాటు చేసి ప్రతీ రూట్ కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించామన్నారు.