చట్టాలు వైసీపీ నేతలకు చుట్టాలయ్యాయా?: రవీంద్ర అరెస్ట్ పై అచ్చెన్న సీరియస్
తన కుటుంబంతో ఆనందంగా శివరాత్రి పండుగ జరుపుకుంటున్న జగన్ రెడ్డి మరో వైపు టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అమరావతి: రాష్ట్రంలో బీసీలపై కక్ష సాధింపులు ఏవిధంగా ఉన్నాయో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు. రవీంద్ర అరెస్టును ఖండించిన ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
''శివరాత్రి నాడు కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారు. తన కుటుంబంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న జగన్ రెడ్డి మరో వైపు టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించి రాక్షసానందం పొందుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్కచేయలని క్రూర స్వభావం జగన్ రెడ్డిది'' అని మండిపడ్డారు.
video మచిలీపట్నంలో హైటెన్షన్... కొల్లు రవీంద్ర బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
''అధికారంలోకి వచ్చిన నాటి నుండే బీసీలపై జగన్ రెడ్డి కన్నెర్ర చేశారు. వైసీపీ అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిన్నటి ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు. పోలీసులు వారిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ చట్టాలు వైసీపీ నేతలకు చుట్టాలు అయ్యాయా?'' అని ప్రశ్నించారు.
''జగన్ తన నిరంకుశ పాలనతో బడుగు, బలహీన వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు'' అని అచ్చెన్న హెచ్చరించారు.