Asianet News TeluguAsianet News Telugu

సోను సూద్ సాయంపైనా కులాలు, రాజకీయాలా...: ప్రభుత్వంపై కళా ఆగ్రహం

చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న దళిత కుటుంబానికి ట్రాక్టర్ ఇచ్చి ఆదుకున్న ముంబైకి చెందిన సినీ నటుడు సోను సూద్ ను ప్రభుత్వం అభినందించాల్సిందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. 

ap tdp president kala venkat rao fires YSRCP Govt
Author
Amaravathi, First Published Jul 29, 2020, 12:23 PM IST

గుంటూరు: చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న దళిత కుటుంబానికి ట్రాక్టర్ ఇచ్చి ఆదుకున్న ముంబైకి చెందిన సినీ నటుడు సోను సూద్ ను ప్రభుత్వం అభినందించాల్సిందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. కానీ ఇక్కడ కూడా కులాలు, రాజకీయ పార్టీలు తీసుకురావటం దళిత వ్యతిరేక చర్య కాదా? అని ప్రశ్నించారు. ఎందుకు అధికార పార్టీ నాయకులు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని కళా నిలదీశారు. 

''బాబూజగజ్జీవన్ రామ్ బావాజాలానికి, అంబేద్కర్ ఆశయాలకు, గుర్రంజాషువా సిద్దాంతాలకు వ్యతిరేకంగా జగన్ పాలన సాగిస్తూ దళితులను అడుగడుగునా అన్యాయానికి, అవమానాలకు గురి చేస్తున్నారు. రాష్ర్టంలో దళిత వ్యతిరేక పాలన కొనసాగుతోందటానికి ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులే నిదర్శనం. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులను అణచివేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే రాష్ర్టంలో దళితుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.  ఓ వైపు ప్రభుత్వం ఎస్సీ సంక్షేమానికి కోతలువిధిస్తూనే మరో వైపు నామినేటెడ్ పోస్టుల్లో మొండి చేయి చూపుతూ దళితులను అగాధంలోకి నెడుతుంది. మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దళితులపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. సంక్షేమ పధకాలతో దళితులను ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వం వారిని సంక్షోభంలోకి నెట్టింది'' అని విమర్శించారు. 

''జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళిత సంక్షేమానికి గ్రహణం పట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.4500 కోట్లు కోత విధించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అమ్మఒడికి రూ.1,271 కోట్లు, వసతి దీవెనకు రూ.3,070 కోట్లు దారి మళ్లించి దళితుల నోటికాడ కూడు లాగేశారు.  టీడీపీ ప్రభుత్వం డ్రైవర్ గా ఉన్న దళితులను ఓనర్ గా చేస్తే.. వైసీపీ ప్రభుత్వం ఓనర్ గా ఉన్న దళితులను క్లీనర్ స్దాయికి దిగజార్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవా వాహనాలు అర్హులకు ఇవ్వకుండా పక్కనపడేసింది. ఎస్సీ కార్పోరేసన్ ని నిర్వీర్యం చేశారు. ఈ 14 నెలల పాలనలో ఒక్క దళితుడైనా  లోన్ ఇచ్చారా?'' అని ప్రశ్నించారు. 

read more   ఆ నిర్ణయాధికారం గవర్నర్ ది కాదు...కేంద్రానికి ఇదే సరైన సమయం: యనమల

''నామినేటెడ్ పోస్టుల్లో దళితులను ఎందుకు నియమించలేదు? సలహాదారు పదవికి దళితులు పనికిరారని సాక్ష్యాత్తు సీఎం అసెంబ్లీలో మాట్లాడి దళితులను అవమానపరిచారు. అమరావతిలో అంబేద్కర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే అంబేద్కర్ సృతి వనాన్ని నిలిపివేసింది'' అని ఆరోపించారు. 

''అంబేద్కర్ బావజాలాన్ని బావితరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహంతోపాటు, స్మారకమందిరం, మ్యూజియం వంటి వాటి ఏర్పాటుకు శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రతో దాన్ని నిలిపివేసి మరో విగ్రహం పెడతామంటూ న్యాయస్థానాల్లో చిక్కుల్లో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి మభ్యపెడుతోంది. దళితులు ఎక్కువగా ఉన్న అమరావతి నుంచి రాజధానిని మార్చేందుకు కుట్రచేస్తున్నారు. '' అని అన్నారు.  

''వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. జగన్ 14 నెలల పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు బ్రిటిష్ వారి హయాంలో కూడా జరగలేదు. డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా ముద్ర వేసి నడిరోడ్డుపై పోలీసులు ఈడ్చుకెళ్లారు. జడ్జి  రామకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేశారు. వైసీపీ నేతలు మోసం చేసి జోని కుమారి అనే మహిళను ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారు. ఇసుక అక్రమరవాణాను అడ్డుకున్నందుకు వరప్రసాద్ పై వైసీపీ
కార్యకర్తలు, పోలీసులు, దాడి చేయటమేకాక శిరోముండనం చేయించి మొత్తం దళితజాతిని అవమానించారు'' అని అన్నారు. 

''మాస్కు పెట్టుకోలేదని చీరాలలో ఏరిచర్ల కిరణ్ ని ఎస్సై  తీవ్రంగా కొట్టి చంపాడు. దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా 3 వేల ఎకరాల దళితుల భూముల్ని లాక్కున్నారు. వైసీపీకి దళితులంటే ఎందుకంత కక్ష్య? దళితులు ఈ రాష్ర్ట పౌరులు కాదా? వారిని రాష్ర్టంలో బతకనివ్వరా? వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా దళితులపై కక్షపూరిత వైఖరి విడనాడాలి, లేకపోతే వైసీపీ అహంకార పాలనకు అంతం తప్పదు'' అని కళా వెంకట్రావు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios