దాచేపల్లి బాధితురాలిని పరామర్శించిన స్పీకర్ కోడెల
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన ఆయన.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇలాంటి ఘటనలను ఖండించాలని అన్నారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే చట్టాల అమలు ఇంకా పదునుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరూ అప్రమత్తమై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సమాజం ఏం కోరుకుందో నిందితుడికి అదే శాస్తి జరిగిందని అన్నారు. ఈ ఘటనలో చిన్నారి బాధితురాలే కానీ బాధ్యురాలు కాదని.. ఈ సమయంలో ఆమెకు సానుభూతి కాదు... మనోధైర్యం కావాలన్నారు. దాచేపల్లి ఘటనలో ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోడెల సూచించారు.