సారాంశం

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఆదిత్యనాథ్ దాస్ కు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.

అమరావతి: ఆంధ్రప్రదేస్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తొలగించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లక్ష్మణ రేఖ దాటారని ఆయన ఆరోపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని ఆయన ఆరోపించారు. 

సజ్జల రామకృష్ణా రెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని గవర్నర్ కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలను లేఖలో ప్రస్తావించారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స లక్ష్మణ రేఖ దాటి తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు. 

తనపై మంత్రుల విమర్శలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన సజ్జలపై అన్నారు. సజ్జలపై చర్యల విషయంలో తనకు అడ్వకేట్ జనరల్ మీద నమ్మకం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దల తీరుపై తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కోర్టుకు వెళ్లడం కన్నా ముందు మీ దృష్టికి తెస్తున్నానని, తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని ఆయన గవర్నర్ కు రాసిన లేఖలో అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు మరో లేఖ రాశారు. ఈసారి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను లక్ష్యంగా ఎంచుకున్నారు.  ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించాలని సూచిస్తూ ఆయన ఆ లేఖ రాశారు.

Also Read: నీ అడ్డగోలు ఆర్డర్స్‌ను అమలు చేయం: నిమ్మగడ్డకు సజ్జల చురకలు

కొన్ని పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉండడంపై ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే. ఆ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ కు లేఖ రాశారు.

కుల ధ్రువీకరణ పత్రాలపై, ఎన్ఓసీలపై వైఎస్ జగన్ ఫొటోలను తొలగించాలని ఆయన ఆ లేఖలో సూచించారు. ఈ విషయంపై జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 

Also Read: నీ అడ్డగోలు ఆర్డర్స్‌ను అమలు చేయం: నిమ్మగడ్డకు సజ్జల చురకలు

ఆ విషయంపై తాహిసిల్దార్లకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్ కు సూచించారు. వాటిపై జగన్ ఫొటోలు ఉండడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల జారీలో వివక్ష లేకుండా చూడాలని కూడా ఆయన సూచించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నేడు, రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటించనున్నారు.