ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలను (New Districts) ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ముమ్మరం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. రేపటితో (మార్చి 3) కొత్త జిల్లాలపై అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలను (New Districts) ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ముమ్మరం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. రేపటితో (మార్చి 3) కొత్త జిల్లాలపై అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అయితే ఇప్పటివరకు 7,500 అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్వి విజయ్ కుమార్ (Vijay Kumar) వివరాలు వెల్లడించారు. ఒక్క విజయనగరంలోనే 4 వేల అభ్యంతరాలు వచ్చినట్టుగా చెప్పారు. అభ్యంతరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. అంశాల వారీగా తీసుకుంటే అవి తక్కువగా ఉన్నాయని చెప్పారు. అంశాలవారీగా చూస్తే దాదాపు 60 వరకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.
అభ్యంతరాలు అన్నింటినీ క్రోడికరించి సీఎం జగన్ నివేదించనున్నట్టుగా చెప్పారు. లోక్సభ నియోజకవర్గం యూనిట్గా జిల్లాల ఏర్పాటు చేయాలనే సూత్రం వల్ల కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ప్రజల ఆంకాంక్షలు పూర్తి చేసే విధంగానే తుది మార్పులు ఉంటాయని చెప్పారు. సహేతుకమైన సమస్యలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.
మార్చి 3వ తేదీ వరకు ప్రజలు వారి అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం ఉందని విజయ్ కుమార్ అన్నారు. ప్రాథమికంగా జిల్లాల వారీగా సాధ్యమైనంత వరకు ఫీల్డ్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశామని అన్నారు. మార్చి 3వ తేదీన సూచనల స్వీకరణ అయిపోయిన తర్వాత.. వారం రోజులు వాటిపై అధ్యయనం చేయనున్నట్టుగా చెప్పారు.
జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి, సంబంధిత విభాగాలకు నివేదికలను పంపించడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ తయారు చేయడం జరుగుతుందని చెప్పారు. కొత్త జిల్లాలపై ఈ నెలాఖరు లోపు తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టుగా విజయ్ కుమార్ చెప్పారు. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజనను పూర్తి చేస్తామని తెలిపారు.
ఇక, కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్ సైట్లో ప్రతీరోజూ అప్లోడ్ చేయాల్సి వుంటుంది. ఇలా అప్లోడ్ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.
ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
