టోన్ మార్చిన టీడీపీ: సీఎస్ తో గొడవే లేదన్న మంత్రి సోమిరెడ్డి
ఏపీ సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎమ్మార్ కేసులో నిందితుడంటూ, కోవర్టు అంటూ సాక్షాత్తు చంద్రబాబు విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే అనూహ్యంగా ఏపీ కేబినెట్ భేటీలో సీఎస్ ను ప్రత్యేకించి చంద్రబాబు అభినందించడం ఆసక్తికరంగా మారింది.
అమరావతి: తమకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తమకు అధికారులతో ఎలాంటి విబేధాలు లేవని అందరితో కలిసే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీ కేబినెట్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తమకు అధికారులు సహకరించారు కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో 10.5 శాతం వృద్ధి రేటుతో ఏపీ ముందంజలో ఉందంటే అందుకు అధికారుల కృషి ఎక్కువగా ఉందన్నారు.
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను తాము ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు. సీఎస్ వర్సెస్ సీఎం అనేది సరికాదని తాము ప్రధాని నరేంద్రమోదీతో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎంతోమంది సిఈసీలను ఈసీలను చూశానని కానీ ఇలాంటి ఎన్నికల కమిషన్ ను చూడలేదన్నారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టే సమీక్షలను అడుగడుగునా అడ్డుకునేందుకు ఈసీ ప్రయత్నించిందని సోమిరెడ్డి మండిపడ్డారు. అధికారులు బిజినెస్ రూల్స్ పాటించాల్సిందేనని చెప్పామే తప్ప ఇంకేమీ అనలేదని వారితో ఇప్పటికీ ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రావన్నారు.
మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశానికి ముందు సీఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎస్ ఎవరంటూ నిలదీశారు. సీఎస్ ను ప్రభుత్వం నియమిస్తే సీఎం ను కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క కేబినెట్ సమావేశం అనంతరం వెంటనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టోన్ మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఏపీ సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎమ్మార్ కేసులో నిందితుడంటూ, కోవర్టు అంటూ సాక్షాత్తు చంద్రబాబు విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే అనూహ్యంగా ఏపీ కేబినెట్ భేటీలో సీఎస్ ను ప్రత్యేకించి చంద్రబాబు అభినందించడం ఆసక్తికరంగా మారింది.