జగన్ పేరు మారింది, ఏంటో తెలుసా?: లోకేష్ సెటైర్లు
లోకేష్ విమర్శలు
కుప్పం: ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శిస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తోందిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు భయం పట్టుకొందని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో మంత్రి లోకేశ్ పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. నాలుగేళ్థు దాటిన తర్వాత రాష్ట్రానికి ఇచ్చిన హమీల్లో 85 శాతం అమలు చేశామని చెప్పడం దారుణమని ఆయన విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీలో కేవలం 200 ఐటీ ఉద్యోగాలే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో లెక్కకు మించి ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని కుల, మతాలకు అతీతంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడును బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రానికి నాలుగేళ్ళుగా అన్యాయం చేసినా వైఎస్ఆర్సీపీ నేతలు ఎందకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మోడీపై విమర్శలు గుప్పిస్తే జైలుకు వెళ్తారనే భయం వైసీపీ నేతల్లో ఉందని లోకేష్ విమర్శించారు. నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి జగన్, పవన్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25 కి 25 లోక్సభ సీట్లు సాధిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.