ఫలించిన చిన రాజప్ప దౌత్యం: అలకవీడిన మంత్రి గంటా
గంటాతో చినరాజప్ప చర్చలు సఫలం
విశాఖపట్టణం: ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అలకవీడారు. గురువారం ఉదయం డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప దౌత్యం ఫలించింది. ఇవాళ విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటనలో పాల్గొంటానని గంటా శ్రీనివాసరావు హమీ ఇచ్చారు.
రెండు మూడు రోజులుగా టిడిపి నాయకత్వం తీరుపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన రెండు రోజలు క్రితం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడ హజరుకాలేదు. అంతేకాదు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇంటికే పరిమితమయ్యారు.
గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖలో సుమారు 7 గంటల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే విశాఖలో సీఎం కార్యక్రమం ఉన్నందున గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనే విషయమై స్పష్టత రాలేదు. దీంతో బుధవారం నుండే టిడిపి సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావుతో చర్చించారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు.
ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ మంత్రి గంటా శ్రీనివాసరావుతో బుధవారం నాడు ఫోన్లో మాట్లాడారని సమాచారం. గంటా అసంతృప్తికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. అలకవీడాలని బాబు గంటా శ్రీనివాసరావుకు నచ్చజెప్పారు..
అయితే గురువారం నాడు ఉదయం విశాఖ జిల్లా ఇంఛార్జీ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గంటా శ్రీనివాసరావుతో చర్చించారు. పార్టీ నాయకత్వంతో ఈ విషయాలపై చర్చించనున్నట్టు చెప్పారు. తన అభిప్రాయాలను గంటా శ్రీనివాసరావు చినరాజప్పకు వివరించారు. ఎట్టకేలకు సీఎం కార్యక్రమానికి హజరయ్యేందుకు ఆయన అంగీకరించారు.
అయితే గంటా శ్రీనివాసరావుతో చర్చల సారాంశాన్ని చినరాజప్ప సీఎంకు వివరించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను మంత్రి గంటా శ్రీనివాస్ ను ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చే బాధ్యతలను అప్పగించారు. దీంతో భీమిలిలో సీఎం పర్యటనలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.