జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  వైసీపీపై చేసిన విమర్శలకు ఏపీ  మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 2008 నుండి రాజకీయాల్లో ఉన్న పవన్  కళ్యాణ్  ఎమ్మెల్యేగా  గెలవలేదని  ఆయన  ఎద్దేవా  చేశారు. అలాంటి  పవన్  ప్రభుత్వాలను  ఎలా  కూలుస్తాడో  చెప్పాలన్నారు. 

అమరావతి: ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెళ్తానన్నట్టుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలున్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిన్న వైసీపీపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. సోమవారంనాడు అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

2008లో రాజకీయాల్లోకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఎక్కడా గెలవలేదన్నారు. శాసనసభలో అడుగుపెట్టని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను కూల్చేస్తాడా అని సెటైర్లు వేశారు. జనసేనను రౌడీసేన అన్నందుకు బాగా రెచ్చిపోయి మాట్లాడారన్నారు. ‘ఏయ్‌ కొట్టేస్తా...పగలకొట్టేస్తా.. కూల్చేస్తా.. అన్నది రౌడీ నాయకుల మాటలు కాదా..? అని మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. నాడు ప్రజారాజ్యం పార్టీలో ఉండి పంచలూడకొడతానన్నాడన్నారు. ఇవాళ ఇళ్లు కూల్చేస్తానంటున్నాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. గొంతు పిసికి చంపేస్తానంటే చేతులు కట్టుకుని మేం కూర్చొంటామా..? మంత్రి అంబటి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎందుకంత ప్రస్టేషన్ వచ్చిందో తెలియడం లేదన్నారు. 

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పొలిటీషియన్స్‌ను చూస్తాననుకోలేదని ఆయన చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ వెంట వెళితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనన్నారు. ఇప్పటంలో రోడ్ల మీద గోడలు కట్టుకుంటే ప్రభుత్వం పగులకొట్టడం అన్యాయమా..? అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ ఏంటి..? దొంగ సంతకం పెట్టి రూ.14లక్షలు హైకోర్టుకు జరిమానా కట్టడాన్ని తెగువ అందామా..? ఇది మోసం కాదా.? అని మంత్రి ప్రశ్నించారు. 

అమరావతి యాత్రలో రైతులే లేరన్నారు. పాదయాత్రలో ఐడెంటీకార్డులు చూపించాలని కోరగానే అనగానే పారిపోయారన్నారు.175 స్థానాల్లో 151 స్థానాల్ని వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంటే పవన్‌కళ్యాణ్‌ వేలు నోట్లోనో, చెవిలోనో ఎక్కడ పెట్టుకున్నాడో ఏమో..! అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

 సినిమాల్లో సీరియస్‌ యాక్షన్‌ సీన్లతో పాటు కామెడీ కూడా ఉండాలనుకున్నట్టే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ ఒక జోకర్‌ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ కమెడియన్ గా ఆయన పేర్కొన్నారు. 
జనసేన అనేది ఒక రౌడీసేన. బానిససేన. అమ్ముడుపోయిన సేన అంటూ మంత్రి మండిపడ్డారు.

విప్లవ సాహిత్యం చదివినంతమాత్రాన పవన్‌ విప్లవకారుడు కాలేదన్నారు. మొన్నటివరకూ మాట్లాడిన చేగువేరా ఏమైపోయాడో చెప్పాలన్నారు. ఇప్పుడు బీజేపీ అంటున్నారన్నారు. ఎక్కడ చేగువేరా.. ఎక్కడ మోదీ.. విప్లవ సాహిత్యం చదివిన మేధావుల్లారా పవన్ కల్యాణ్ వ్యవహారంపై ఆలోచన చేయాలని ఆయన కోరారు. మోస్ట్‌ అన్‌ రిలయబుల్‌ పొలిటిషీయన్‌ కొణిదెల పవన్‌కళ్యాణ్‌ అంటూ మంత్రి రాంబాబు చెప్పారు.

also read:రైతులతో ఒప్పందంలో రాజధాని అని ఎక్కడుంది?: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

2024లో పొత్తుల్లేకుండా పోటీ చేస్తాడా..? భీమవరంలో పోటీచేస్తాడా..? గాజువాకలో పోటీచేస్తాడా..? 25 స్థానాలకన్నా ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తాడా..? అసలు, ఎవరితో కలిసి పోటీచేస్తాడో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి కోరారు. 30 ఏళ్లపాటు సంస్కారంతో రాజకీయం చేయడానికి వచ్చి ఎవరైనా రెచ్చగొడితే కుంసంస్కారం చూపెడతాననడం నీకు మర్యాదేనా పవన్‌కళ్యాణ్‌..? అని మంత్రి ప్రశ్నించారు.