పాత గుంటూరు పీఎస్ పై దాడి కేసుల విత్డ్రా జీవో: ఎన్ఐఏను ఇంప్లీడ్ చేయాలని హైకోర్టు ఆదేశం
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసుల ఉపసంహారణ జీవోపై ఎన్ఐఏని ఇంప్లీడ్ చేయాలని ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసుల ఉపసంహారణ జీవోపై ఎన్ఐఏని ఇంప్లీడ్ చేయాలని ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఉపసంహారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ ను గురువారం నాడు హైకోర్టు విచారించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో ముస్లిం యువత అని రాయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
లౌకికవాద దేశంలో ముస్లిం యువత అని జీవోలో రాస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సాక్షాత్తూ ఏపీ డీజీపీ సవాంగ్ ఈ కేసును ఉపసంహరించేందుకు సిద్దమయ్యారని పిటిషనర్ ఆరోపించారు. ఈ విషయమై ఏపీ పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. మతపరమైన అంశమైనందున ఎన్ఐఏతో విచారణ చేయిస్తామని హైకోర్టు తెలిపింది.ఈ కేసులో ఎన్ఐఏను ఇంప్లీడ్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.