ఏపీలో పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 10 వేల డీజి లక్ష్మి కియోస్క్లు ఏర్పాటు కానున్నాయి. డ్వాక్రా మహిళల నిర్వహించబోయే ఈ కేంద్రాల్లో 20 రకాల డిజిటల్ సేవలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలనే లక్ష్యంతో "డీజి లక్ష్మి" పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 10 వేల డిజిటల్ కియోస్క్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత పట్టణ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల చేతులలో ఉండేలా చూస్తున్నారు. ముఖ్యంగా డిగ్రీ చదివిన డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి 300 కుటుంబాలకు ఒక కియోస్క్ ఏర్పాటు చేసే విధంగా ఈ వ్యవస్థ రూపొందిస్తున్నారు.
ఈ కేంద్రాల్లో ప్రజలకు దాదాపు 20 రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేయడం, రేషన్ కార్డు అప్డేట్ చేయడం, ఉద్యోగ దరఖాస్తులు సమర్పించడం వంటి సేవలు వీటిలో లభిస్తాయి. అంతే కాకుండా బస్సు, రైలు టికెట్లు బుకింగ్ చేయడం కూడా వీటిలో భాగమే.
ఈ కియోస్క్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాల కొనుగోలుకు రూ.2 లక్షల వరకూ బ్యాంకు రుణం పొందే వీలుంటుంది. మొదటి దశలో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప వంటి 10 నగరాల్లో 4 వేల కియోస్క్లు ప్రారంభించనున్నారు.
ఇవిగాకుండా, అసంఘటిత కార్మికుల కోసం ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందించనున్నారు. దీని కోసం కార్మిక సంక్షేమ శాఖతో మెప్మా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే పురపాలక శాఖతో కలిసి ఆస్తి పన్నులు, తాగునీటి బిల్లుల వసూలు కూడా ఈ కియోస్క్ కేంద్రాల్లో జరగనుంది.ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, తక్కువ ఖర్చుతో అన్ని అవసరమైన సేవలను ఒకే చోట పొందేలా ఈ కార్యక్రమం పనిచేస్తుంది. డిజిటల్ సేవలను ప్రజలందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డీజి లక్ష్మి కియోస్క్లను ప్రారంభిస్తోంది.