శ్రీగౌతమి కేసు: చంద్రబాబు ప్రభుత్వ సంచలన నిర్ణయం
పోలీసులపై చర్యలకు ఏపీ సర్కార్ రెడీ
ఏలూరు: ఏడాదిన్నర క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీగౌతమి మృతి విషయంలో దర్యాప్తును పక్కదారి పట్టించిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ కేసును పక్కదారి పట్టించిన పోలీసుల అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసినట్టు సమాచారం.ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు పూనుకొంది.
2017 జనవరి 18వ తేదిన శ్రీగౌతమి, పావని స్కూటీపై వెళ్తున్న సమయంలో వెనుక నుండి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు.ఈ ఘటనలో శ్రీగౌతమిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పావని ప్రాణపాయం నుండి బయటపడింది. పావని చేసిన పోరాటం కారణంగా శ్రీగౌతమిది హత్యే విషయం తేలింది. పావని ఇచ్చిన ఆధారాలతో సీఐడీ అధికారులు విచారణ చేసి ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసు విషయంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు తమకు బెదిరించారని కూడ పావని ఆరోపిస్తోంది. ఈ కేసు విషయమై కోర్టులో చూసుకోవాల్సిందేనని పోలీసులు తమకు చెప్పారని పావని మీడియాకు చెప్పారు. న్యాయం కోసం తాము పోరాటం చేస్తున్న క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు కొందరు తమను బెదిరించారని కూడ ఆమె ఆరోపించింది. ఈ కేసును సీఐడీ అధికారులు విచారించకపోతే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి కావన్నారు.
ఇదిలా ఉంటే శ్రీగౌతమి కేసులో అరెస్టైన రిమాండ్లో ఉన్న జడ్పీటీసీ బాలం ప్రతాప్, టీడీపీ నేతలు సజ్జా బుజ్జీ, బొల్లంపల్లి రమేష్లపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. వీరిద్దరూ అరెస్టైన విషయాన్ని స్థానిక నాయకత్వం పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చింది. దీంతో పార్టీ నుండి వారిని సస్పెన్షన్ చేస్తూ చర్యలు తీసుకొంది. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఈ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే మాధవనాయుడుకు సమాచారాన్ని ఇచ్చారు.