25 కాదు 26 జిల్లాల దిశగా... కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
గత కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ రంగం సిద్దం చేసిన విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక జీవో కూడా వెలువడింది. అయితే ఈ జీవోలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదివరకు నిర్ణయించినట్లుగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25 కు బదులు 26 కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం వుంది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన జిల్లాల పెంపు కమిటీ జీవో లో మార్పులు చేసింది. 25 లేదా 26 జిల్లాల పెంపుపై కమిటీ అధ్యయనం చేస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
read more తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఛైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కమిటీ కన్వీనర్ గా ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మూడు మాసాల్లో ఈ కమిటీ నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.
పార్లమెంట్ నియోజకవర్గాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుండే నిరసన గళాలు వచ్చాయి. అయితే ఏ రకంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.