Asianet News TeluguAsianet News Telugu

ఏపీ చేతికి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు: ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి ఓ లెక్క!

కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. దీనికి సంబంధించి గురువారం లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 

AP Govt imports one lakh covid 19 rapid test kits from south korea
Author
Amaravathi, First Published Apr 17, 2020, 5:03 PM IST

కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. దీనికి సంబంధించి గురువారం లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది.

క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ ఈ కిట్లను ప్రారంభించారు. శాండర్‌ మెడికెయిడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సింథీ, డైరెక్టర్‌ మురళీధర్‌ సీఎం కు కిట్లను అందించారు. 

తాజా ర్యాపిడ్‌ కిట్ల ద్వారా రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు ఊపందుకుంటున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. వీటిని కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం వాడుతామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Also Read:కరోనా వైరస్: హోమ్ క్వారంటైన్ కి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితం వస్తుందని..  ప్రత్యేకంగా చార్టర్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి కిట్లను దిగుమతి చేసుకున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు.

వీటి వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇస్తున్నామని... మూడు నాలుగు రోజుల్లో ఈ కిట్లు జిల్లాలకు చేరుతాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. 

ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. వీటిని అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టెస్టు కిట్లను ఆర్డర్‌ చేసిందనీ, రానున్న రోజుల్లో వీటిని అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నాణ్యతకు తాము పెద్దపీట వేస్తున్నామని, సాంకేతిపరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు. 

కాగా కరోనా వైరస్‌ పరిస్థితులకు ముందు రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్‌ ఉండేది. మొదట్లో కేవలం ఈ ల్యాబ్‌ నుంచే టెస్టులు చేయించేవారు. కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టింది.

కేవలం 2 వారాల వ్యవధిలో విజయవాడ, కాకినాడ, అనంతపూర్, గుంటూరు, కడప, విశాఖపట్నంలలో ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఇప్పటికే ఈ ల్యాబ్‌ల ద్వారా 2,100 పైగా టెస్టులను ప్రతిరోజూ చేస్తున్నారు.

Also Read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 38 కేసులు, మొత్తం 572కి చేరిక

ఇవికాక రాష్ట్రంలో విస్తృతంగా ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్‌ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240 పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

అందువల్లే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్‌ –19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 16వ తేదీ వరకూ 16,555 మందికి పరీక్షలను ప్రభుత్వం చేసింది.

ప్రతి 10లక్షల మంది జనాభాకు రాజస్థాన్‌లో 549, కేరళ 485, మహారాష్ట్ర 446, ఆంధ్రప్రదేశ్‌లో 331 పరీక్షలు చేశారు. తర్వాత రాష్ట్రాలన్నీ తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ర్యాపిడ్‌ టెస్టు కిట్లతో పరీక్షలు మరింత ఊపందుకుంటాయని, దేశంలోనే తొలి రెండు మూడు స్థానాల్లో నిలుస్తామని అధికారులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios