మినిట్స్ ఇస్తే ఓకే.. లేదంటే ఉద్యమమే, సర్కార్ ట్రాప్లో పడం : తేల్చేసిన బొప్పరాజు
పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అయితే దానిని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ను కోరారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. తాము ప్రభుత్వం ట్రాపులో పడటం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. నిన్న ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి తాము ఉద్యోగుల అన్ని పెండింగ్ బిల్లులను క్లెయిమ్ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అయితే ఏపీ జేఏసీ అమరావతి నేతలు మాత్రం పోరాటానికి సిద్ధమవుతున్నారు. బుధవారం ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అయితే దానిని లిఖితపూర్వకంగా సీఎస్ జవహర్ రెడ్డి ఇవ్వాల్సిందిగా వీరు కోరారు.
సాయంత్రం లోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు. అయితే ఆ తర్వాతే తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు వెల్లడించారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే.. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందని.. ఒకవేళ మినిట్స్ ఇస్తే మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తామన్నారు. కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని.. మినిట్స్ ఇచ్చిన తర్వాత బిల్లులు చెల్లించకుంటే ఉద్యమానికి దిగుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తాము ప్రభుత్వం ట్రాపులో పడటం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.
ALso REad: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. మార్చి 31 నాటికి పెండింగ్ బిల్లుల క్లియర్
ఇకపోతే.. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని తెలిపింది. మొత్తం రూ.3 వేల కోట్ల బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి మంగళవారం కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ సహా వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు.
భేటీ అనంతరం సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని.. అందరం కలిస్తేనే లక్ష్యాలను సాధించగలుగుతామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ , ఆర్ధిక సంక్షోభంతో ప్రభుత్వం కొంత ఇబ్బంది ఎదుర్కొందన్నారు. తమది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం జరిగిందని సజ్జల అంగీకరించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు గాను జీవోఎం మరోసారి సమావేశమైందని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్లో వున్న క్లెయిమ్స్ను మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామన్నారు. జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, టీఏ, డీఏ ఇతర బకాయిలను ఈ నెలాఖరు నాటికి చెల్లిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.