ఏపీలో అడుగుపెట్టాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే..!
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలో అడుగుపెట్టేవారికి ఆంక్షలు విధిస్తోంది.
ఈ విషయంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా స్పందించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు.
పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.