అప్పుడు రాజీనామా చేద్దామనుకున్నా... జగన్ సహనశీలి: వీడ్కోలు వేళ షరీఫ్ వ్యాఖ్యలు
మే 30న శాసన మండలి సభ్యులుగా పదవి విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహమ్మద్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన వీడ్కోలు పలికారు.
మే 30న శాసన మండలి సభ్యులుగా పదవి విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహమ్మద్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లా దయ వల్ల మండలి ఛైర్మన్ పదవి వచ్చిందని, నా శక్తీ సామర్ధ్యం వల్ల కాదని తాను నమ్ముతానని షరీఫ్ అన్నారు.
యువకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్ప సహనశీలి అని ఛైర్మన్ ప్రశంసించారు. ఇది దేవుడు ఇచ్చిన వరమని.. పదవి కోసం తాను ఎప్పుడు పని చేయలేదన్నారు. పదవిని అహంకారంగా భవించవొద్దని, సేవా భావంగా గుర్తించాలని షరీఫ్ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నంతకాలం డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజల మనస్సు లో చిరస్థాయిగా నిలవాలని ఛైర్మన్ అన్నారు.
కార్యకర్త స్థాయి నుండి పార్టీ కోసమే పనిచేశానని... మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ, విప్, ఛైర్మన్ గా విధులు నిర్వర్తించానని షరీఫ్ గుర్తుచేసుకున్నారు. పదవి మూలంగా చెడ్డ పేరు రాకూడదని.. అందరిని మెప్పించేలా ప్రయత్నం చేశానని, కొన్ని సంఘటనలు బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యానని.. ఒకానొక సమయంలో రాజీనామా చేద్దామని అనుకున్నాని షరీఫ్ గుర్తుచేసుకున్నారు. ఎప్పుడు కలిసినా తనను షరీఫ్ అన్నా అని పిలిచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు గౌరవమన్నారు.
Also Read:చంద్రబాబు కరోనావైరస్ లాంటివాడు, షరీఫ్ అంగీకరించారు: సజ్జల
నేను తీసుకున్న నిర్ణయం దైవ కల్పిత నిర్ణయం గా భావించానని... నా సేవా గుణం దైవ సంకల్పితమన్నారు. నా సేవా భావాన్ని, కష్టాన్ని గుర్తించి అల్లా ప్రేరణతో చంద్రబాబు తనకు పదవులు ఇచ్చారని షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. తన పదవి కాలంలో తప్పులు జరిగితే, పెద్ద మనస్సు తో అర్ధం చేసుకోవాలని సూచించారు.
మీరు చూపిన ప్రేమ అభిమానాన్ని నా గుండెల్లో ఉంచుకుంటానని.. తన పదవి కాలంలో సహకారాన్ని అందించిన సిబ్బందికి షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. నాకు ప్రస్తుతం 67 ఏళ్ల వయసు వచ్చిందని.. తన శేష జీవితాన్ని ఆధ్మాత్మికంగా గడపాలని కోరుకుంటున్నానని అయితే ప్రజా సేవలో కూడా ఉంటానని షరీఫ్ స్పష్టం చేశారు.
అలాగే ఈ నెల 30 న పదవి విరమణ చేస్తున్న ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, డిసి గోవింద రెడ్డి లకు కూడా మండలి సభ్యులు వీడ్కోలు పలికారు. అనంతరం ఛైర్మన్ ఛాంబరులో మండలి ఛైర్మన్ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, పలువురు ఎమ్మెల్సీ లు సన్మానించారు.