అలాకాకపోతే మరోపోరాటనికి సీఎం జగన్ సిద్ధం
కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ముందే చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైయస్ జగన్ పై భరోసాతో ఓట్లు వేసిందని స్పష్టం చేశారు. ఇకపోతే తుని రైలు ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.
కాకినాడ: ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సంజీవని అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.
ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హోదా సాధించే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
కాకినాడలో మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదే నెరవేర్చబోతున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కాపులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు.
గడిచిన ఐదేళ్లలో కాపు సామాజిక వర్గాన్ని ఏన్నో అవమానాలకు గురిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ సందర్భంగా తుని రైలు దహనం ఘటనలో టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.
తుని రైలు దహనం ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావుల ప్రమేయం ఉందని దాడిశెట్టి రాజా ఆరోపించారు. టీడీపీ హయాంలో అవసరానికి మించి అప్పులు చేసినట్లు యనమల అంగీకరించారని, ఓటమి అనంతరం తమపై నిందలు వేయడం సరికాదని హితవుపలికారు.
కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ముందే చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైయస్ జగన్ పై భరోసాతో ఓట్లు వేసిందని స్పష్టం చేశారు. ఇకపోతే తుని రైలు ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.