Asianet News TeluguAsianet News Telugu

ఏపీని నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: ఎక్సైజ్ శాఖ సమీక్షలో ఏపీ సీఎం జగన్

రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు  కృషి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. మాదక ద్రవ్యాల నివారణకు  అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
 

AP CM YS Jagan Reviews  on Excise department
Author
First Published Dec 19, 2022, 4:47 PM IST

అమరావతి:నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాల్సిన అవసరం ఉందని  ఏపీ సీఎం  వైఎస్ జగన్ తెలిపారు.స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్‌ శాఖపై క్యాంప్‌  కార్యాలయంలో  ఏపీ సీఎం  వైఎస్ జగన్‌  సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగించకుండా  ఉండాలన్నారు.ఈ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు పని చేయాలని సీఎం జగన్  సూచించారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో   భారీ హోర్డింగ్స్‌ పెట్టి .ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను  ప్రచారం చేయాలన్నారు.నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలని  సీఎం జగన్ ఆదేశించారు.పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. 

రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని  సీఎం సూచించారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం సూచించారు.
మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలన్నారు.దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు చేయాలన్నారు.  ప్రతి మంగళవారం  సమన్వయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గురువారం పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశమై  అక్రమ మద్యం, గంజాయి సాగు నివారణపై చర్యలపై సమీక్షించాలని సీఎం కోరారు. 

రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు అధికారులు పనిచేయాలన్నారు.  యూనివర్సిటీలు, కాలేజీలు అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలన్నారు. రాష్ట్రంలో  దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం జగన్  అధికారులను కోరారు. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ నిర్వహించాలన్నారు. 

అక్రమ మద్యం,పబ్లిక్‌ ప్లేసెస్‌లో మద్యపానం, ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం వంటి ఫిర్యాదులపై  ఎస్‌ఈబీ అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఎస్‌ఈబీ పరిధి కేవలం లిక్కర్‌ వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు.  

రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.ఈ  భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నియంత్రణ, ఆ దిశలో తీసుకున్న చర్యలు, గంజాయి సాగు ధ్వంసం, గంజాయి సాగు చేస్తున్నవారిపై నమోదైన కేసులను  అధికారులు వివరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం  కె.నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ భార్గవ, ప్రొహిబిషన్‌,ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios