బెజవాడలో అంబేద్కర్ విగ్రహం.. నవంబర్ 1న పనులు: అధికారులకు జగన్ ఆదేశం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం తయారీకి వెంటే ఆర్డర్ ఇవ్వాలని... నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నవంబర్ 1న పనులు ప్రారంభించి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్క్ నిర్మాణానికి సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉండాలని ఆయన సూచించారు. అదే విధంగా అక్కడ నిర్మించే పార్క్ సైతం పైర్తి ఆహ్లాదకర వాతావరణం కలిగి వుండాలని జగన్ స్పష్టం చేశారు.
విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం ఎక్కడ ఉందో గమనించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నవంబర్లో పనులు మొదలుపెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని, ఈలోపు ఆ స్థలంలో వున్న ఇరిగేషన్ ఆఫీస్లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా ఎంజీ రోడ్ నుంచి పార్క్ కనెక్టివిటీ అందంగా తీర్చిదిద్దాలని.. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే కనిపించేలా ప్రణాళిక రచించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పార్క్లో ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు.
కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్ మాత్రమే కమర్షియల్గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించాలని, మంచి ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.