ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి డిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. రేపు(సోమవారం) సాయంత్రం ఢిల్లీ వెళనున్నారు సీఎం జగన్. సాయంత్రం 3.30కి కడప ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ను ఖరారయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ లభించడంతో ఆయనతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు సహకారం, సమస్యల పరిష్కారం గురించి వివరించే అవకాశాలున్నాయి. ఎల్లుండి ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీ పై రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, షెకావత్‌లతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. 

సీఎం పర్యటన వివరాలు:

సీఎం డిల్లీ పర్యటన ఖరారయిన సమయంలోనే ఏపీకి కేంద్రం ఓ శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు రుణం పొందడానికి కేంద్ర ఆర్థిక అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

 ఇక 10 రోజుల క్రితమే సీఎం జగన్ డిల్లీలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పలుమార్లు భేటీ అయ్యారు. గత మంగళవారం రాత్రి సుమారు గంటకు పైగా సీఎం జగన్ అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా బుధవారం మరోసారి సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు.

రెండో రోజు కూడా అమిత్ షాతో జగన్ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. జగన్ తో పాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అమిత్ షాను కలిశారు అంతర్వేద రథం దగ్ధం ఘటన, అమరావతి భూకుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.రెండు సార్లు అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొగా తాజాగా మరోసారి సీఎం జగన్ డిల్లీ టూర్, ప్రధానితో భేటీ కానున్నట్లు ప్రకటించడంతో ఈ చర్చ రెట్టింపయ్యింది.