జగనన్న అమ్మఒడి  పథకం కింద  లబ్దిదారుల ఖాతాల్లోకి ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  నిధులను విడుదల చేశారు.  కురుపాంలో  నిర్వహించిన కార్యక్రమంలో  ఈ నిధులను సీఎం విడుదల  చేశారు.  

విజయనగరం: వచ్చే నెలలో ట్రైబల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేయనున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం లో అమ్మఒడి పథకం కింద ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పది రోజుల పాటు జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. అమ్మఒడి పథకం కింద ఇప్పటివరకు రూ. 26,067.28 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో విద్యారంగంపై తమ ప్రభుత్వం రూ. 66,722.36 కోట్లు ఖర్చు చేశామన్నారు. 83 లక్షల మంది విద్యార్ధులకు అమ్మఒడి ద్వారా లబ్ది జరగనుందని సీఎం జగన్ చెప్పారు.ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అంతేకాదు ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన విద్యార్ధులు ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.రానున్న తరం మన కంటే బాగుండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చెప్పారు. 
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు. 

ఏపీ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్ధులు గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.మూడో తరగతి నుండే సబ్జెక్టు టీచర్ ఉండేలా చర్యలు తీసుకున్న విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు.అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు. విద్యార్ధులకు సులువుగా పాఠాలు అర్ధమయ్యేలా డిజిటల్ బోధనను అమల్లోకి తెచ్చామన్నారు.ఆరో తరగతి నుండే ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటలైజేషన్ చేసినట్టుగా సీఎం చెప్పారు.డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్ధులకు ట్యాబ్స్ కూడ అందిస్తున్నట్టుగా జగన్ తెలిపారు.

also read:టీడీపీ అంటే తినుకో..దండుకో..పంచుకో: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్

నాడు-నేడు తో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలను మార్చివేశామన్నారు. పెద్ద చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని గురించి వందశాతం ఫీజును రీఎంబర్స్ మెంట్ చేసేందుకు జగనన్న విద్యాదీవెన పథకం అమల్లోకి తెచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.విదేశాల్లో పెద్ద చదువులు చదువుకునే విద్యార్ధులకు ఎక్కడ సీటు వచ్చినా రూ. 1.25 కోట్లు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 

చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. పెత్తందారులకు అందుబాటులో ఉన్న చదువులకన్నా గొప్ప చదువులు పేదల పిల్లలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్టుగా సీఎం తెలిపారు.పేద కుటుంబాల్లో వెలుగు నింపేలా ప్రభుత్వ బడులు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం జగన్.తమ ప్రభుత్వం తీసుకున్న విధానాల కారణంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడే పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 70.16 శాతం పిల్లలు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారని సీఎం జగన్ గుర్తు చేశారు. 

గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చివరి గ్రామం వరకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రానున్నాయని సీఎం జగన్ వివరించారు.