అటువంటి వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు.. సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులై వివిధ కారణాలతో లబ్దిపొందని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా ఏపీ సీఎం జగన్ (cm jagan) చెప్పారు. అర్హత ఉన్న సంక్షేమ పథకాల లబ్ది పొందని (eligible beneficiaries) 9,30,809 మందికి రూ.703 కోట్లను మంగళవారం నేరుగా వారి ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (cm jagan) మరో శుభవార్త చెప్పారు. సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులై వివిధ కారణాలతో లబ్దిపొందని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. అర్హులు ఎవరూ మిగిలి పోకూడదని, అందరికీ ప్రయోజనం చేకూరాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. అర్హత ఉన్న సంక్షేమ పథకాల లబ్ది పొందని (eligible beneficiaries) 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్.. వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు.
గతంలో పథకాల కోసం ప్రజలు ఎదురు చూసేవారని.. కానీ ప్రస్తుతం ప్రజలనే వెతుక్కుంటూ నేరుగా పథకాలు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. పథకాలు అమలు చేసేటప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడటం లేదని చెప్పారు. అర్హత ఉంటే చాలు అందరికీ అందాలనే కోణంలో ప్రతి అడుగు వేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల పొందేందుకు అర్హులై ఉండి.. దరఖాస్తు చేసుకోకపోవడమో, అర్హత నిర్ధారణలో పొరపాట్ల కారణం చేతనో, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడమో... ఈ విధంగా వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా సీఎం జగన్ స్పష్టం చేశారు.
పొరపాటున సంక్షేమ ఫలాలను అందుకోలేకపోయిన అర్హులు నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించి వారికి కూడా లబ్ధి కలిగిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరులో అంటే ఏడాదికి రెండు దఫాలు వారికి ప్రయోజనం చేకూరుస్తామని అన్నారు. ‘డిసెంబరు నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారికి జూన్లో, జూన్ నుంచి నవంబరు వరకు అమలైన పథకాలకు అర్హులైన వారికి డిసెంబరులో అందిస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ పక్రియ చేపడతాం’ అని సీఎంజగన్ చెప్పారు.