మా ఇంటిపైకి మనుషులను పంపారు, బాలకృష్ణపై కేసు ఎందుకు పెట్టరు..?
చంద్రబాబుపై విరుచుకుపడ్డ సోము వీర్రాజు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అమిత్ షా వాహనంపై రాళ్ల దాడికి పాల్పడిన కార్యకర్తలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రధానిపై బాలకృష్ణ మాట్లాడిన మాటలకు కూడా చంద్రబాబు నవ్వుతున్నారని ఆయన మండి పడ్డారు. దేశ ప్రధానిని అన్ని మాటలు తిట్టిన బాలకృష్ణ పై ఇంతవరకు ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదన్నారు. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టడం లేదన్నారు. తన ఇంటిపైకి కూడా కార్యకర్తలను పంపించారన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ఎలా అన్నారు.
అలిపిరి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. నాలుగేళ్లు నోరుమూసుకొని ఉండి.. ఎన్నికలు దగ్గరపడగానే ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. అసలు హోదా కోసం ప్రశ్నించే హక్కే టీడీపీ నేతలకు లేదన్నారు.