పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తోనే కేసు మొత్తం నడవడం లేదు: సీఐడీ వర్గాలు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పీవీ రమేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని అనడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. రమేష్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు ప్రధానాత్య సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పీవీ రమశ్ వ్యాఖ్యలపై సీఐడీ వర్గాలు స్పందించాయి.
పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమేనని తెలిపింది. ఈకేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయని వెల్లడించింది. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయని తెలిపింది. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లామని వివరించింది. కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమేనని పేర్కొంది.
ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది. నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదని తెలిపింది. రూ.371 కోట్లు విడుదలచేసేముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టుకాదని ఆమె వారించారని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్కు ముందుగా విడుదలచేద్దామని పీవీ రమేశ్ గట్టిగా సూచించారని తెలిపింది. ఎక్కడో గుజరాత్లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని చెప్పింది. ఈ అభ్యంతరాలను, సూచనలను పీవీ రమేశ్ పక్కనపెట్టారని తెలిపింది.
Also Read: స్కిల్ డెవలప్మెంట్ కేసు : నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం... మాజీ ఐఏఎస్ పీవి రమేశ్
ఈ కేసులో ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయని సీఐడీ వర్గాలు తెలిపాయి. పీవీ రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్ చేయలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.