మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ఎస్ఈబీతో చెక్: కన్నబాబు
మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబీని బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకొందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.
అమరావతి: మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబీని బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకొందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.
గురువారం నాడు ఏపీ కేబినెట్ లో తీసుకొన్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు అమరావతిలో మీడియాకు వివరించారు.కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
also read:కొత్త ఇసుక పాలసీ: ఏపీ కేబినెట్ ఆమోదం
ఆఫ్ లైన్ , ఆన్ లైన్ విధానంలో కూడ ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. పారదర్శకంగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు.ఇసుక నాణ్యతను పరీక్షించుకొనే వెసులుబాటు కూడ ఉందని ఆయన చెప్పారు.
ఎస్ఈబీకి అదనపు సిబ్బంది కేటాయింపునకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. గ్యాంబ్లింగ్, ఆఫ్ లైన్,ఆన్ లైన్ బెట్టింగ్ , మట్కా, గంజాయి, నిషేధిత గుట్కా విక్రయాలు, సరఫరాను కూడ ఎస్ఈబీ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.
ఎర్రచందనం అరికట్టేందుకు గాను ఇప్పటికే ఉన్న టాస్క్ ఫోర్స్ తో ఎస్ఈబీని అనుసంధానం చేయనున్నట్టుగా కన్నబాబు చెప్పారు. ఎస్ఈబీ బలోపేతానికి ఔట్ సోర్సింగ్ లో 71 పోస్టులు, ఇతర డిపార్ట్ మెంట్ల నుండి 31 మందిని డిప్యూటేషన్ పై తీసుకొనేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
అగ్నిమాపక సంస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బందరు పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.నవంబర్ 24న జగనన్నతోడు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా మంత్రి తెలిపారు.
ఆదోనిలో మతఘర్షణలకు సంబంధించిన కేసుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సున్నా వడ్డీ పంట రుణాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.