కర్నూలు జిల్లా ఆదోనీలో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి
ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో (ap cabinet reshuffle) భాగంగా మంత్రి పదవిని దక్కించుకున్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి (vidadala rajini ) అప్పుడే వినతులు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా (ap health minister) పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు తమ సమస్యలపై విజ్ఞప్తులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే రజనీకి.. ఆ సోషల్ మీడియా వేదికగానే ఏపీ బీజేపీ (bjp) నేత విష్ణువర్ధన్ రెడ్డి (vishnu vardhan reddy) బుధవారం ఓ వినతిని పంపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కర్నూలు జిల్లాలో నెలకొన్న ఓ సమస్యను పరిష్కరించాలని కోరారు.
'కర్నూలు జిల్లా ఆదోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో విద్యుత్ సమస్య, ఆక్సిజన్ అందక నిన్న రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. రోగులను ఆదుకోండి వైద్య శాఖా మంత్రి రజనీ గారు' అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇకపోతే.. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విడదల రజనీకి జగన్ తొలి కేబినెట్లోనే మంత్రి పదవి దక్కాల్సి వుంది. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో అప్పుడు కుదరలేదు. అయితే తాజా పునర్వ్యస్ధీకరణలో భాగంగా రజనీకి అవకాశం కల్పించారు జగన్. ఈ నెల 11న జరిగిన కార్యక్రమంలో ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రజనీకి అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు సీఎం జగన్.
