Asianet News TeluguAsianet News Telugu

ఎవరి కోసం ఎన్నికలు... కోర్టు తీర్పు వరకు ఆగాలి: నిమ్మగడ్డపై తమ్మినేని విమర్శలు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన నిమ్మగడ్డ ప్రెస్‌ మీట్‌ కేవలం పొలిటికల్‌ సమావేశంలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు

ap assembly speaker tammineni sitaram slams sec nimmagadda ramesh kumar ksp
Author
Amaravathi, First Published Jan 23, 2021, 6:50 PM IST

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన నిమ్మగడ్డ ప్రెస్‌ మీట్‌ కేవలం పొలిటికల్‌ సమావేశంలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని తమ్మినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారని స్పీకర్ దుయ్యబట్టారు.

చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారని.. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉందని ఆయన గుర్తుచేశారు.

కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పొతే బాధ్యత ఎవరు తీసుకుంటారని తమ్మినేని నిలదీశారు.

Also Read:నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్: ఏపీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు

నిమ్మగడ్డ కుర్చీలో ఉండగానే ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా, ఎందుకంత నియంతృత్వ పోకడ అంటూ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా అని ఆయన దుయ్యబట్టారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం సబబేనా అని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారని.. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్‌ ప్రశ్నించారు.

రాజ్యాంగంలో పొందు పరచిన ఫోర్స్ మెజర్ కేసు క్రింద పరిగణించి ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారని.... రేపో మాపో పోలీసులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తారని తమ్మినేని జోస్యం చెప్పారు.

అప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారని.. ఎన్నికలు వద్దని ఉద్యోగులు, ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని..  దానిని కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తమ్మినేని ప్రశ్నించారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు రైట్ టూ లివ్ ఆర్టికల్ తెలియదా..? అని ఆయన నిలదీశారు. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని.. న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూడాలని తమ్మినేని సూచించారు. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని.. అవసరం అయితే దీనిపై ప్రజల్లోకి రెఫరెండమని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios