గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. రెండేళ్లు పెండింగ్లోనే , రాజ్యసభ ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్
రాజ్యసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది.
![ap assembly speaker tammineni sitaram accepted tdp mla ganta srinivasa rao resignation ksp ap assembly speaker tammineni sitaram accepted tdp mla ganta srinivasa rao resignation ksp](https://static-ai.asianetnews.com/images/01eewag0p78tgfkd9hcqzpn1td/ganta-jpg_363x203xt.jpg)
రాజ్యసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి వైసీపీ అభ్యర్ధిపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు గంటా శ్రీనివాసరావు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన అంటిముట్టనట్లుగానే వ్యవహరించారు. ఒకదశలో గంటా వైసీపీలో చేరుతారంటూ ప్రచారం సైతం జరిగింది. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కదం తొక్కడంతో వారికి గంటా శ్రీనివాసరావు మద్ధతు ప్రకటించారు.
కేవలం మద్ధతుతో సరిపెట్టకుండా ఎవ్వరూ ఊహించని విధంగా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. అలా దాదాపు రెండేళ్ల కాలం గడిచిపోయింది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండటంతో గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ ఆరోపిస్తోంది.