అంతర్వేది స్వామివారి రథం దగ్ధం... జగన్ సర్కార్ సీరియస్, ఈవోపై వేటు
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.
విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. సొమవారం బ్రాహ్మణ వీధిలోని దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన మాట్లాడారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా? అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
హిందువుల దేవాలయల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గతంలో పుష్కరాల వంకతో చంద్రబాబు 40 గుళ్ళు కూల్చేశాడని... అదే పుష్కరాల్లో పుష్కరాల్లో 23 మందిని పొట్టపెట్టుకున్నాడని అన్నారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయలేదని ప్రశ్నించారు.
read more అంతర్వేది ఘటన దురదృష్టకరం-ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు అదేశించిన మంత్రి
ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా ప్రతి దేవాలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసామన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రతి పక్షాలే కుట్ర చేశాయనే అనుమానం కలుగుతోందని...ఈ ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో శాసనమండలిలో సవాల్ విసిరితే లోకేష్ పారిపోయాడని... ఇలా సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తా మమ్మల్ని విమర్శించేది అని మంత్రి మండిపడ్డారు.
అంతర్వేది టెంపుల్ సిబ్బంది పై వేటు
అంతర్వేది ఆలయ ఈవో పై బదిలీ వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసామని...అంతర్వేదిలో సిసి కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేశామన్నారు మంత్రి. దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామన్నారు.
వ్యవస్ధలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నా దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేడని మంత్రి హెచ్చరించారు. తాము హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూస్తామన్నారు.ఇతర దేవాలయాల్లో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దని మంత్రి వెల్లంపల్లి సూచించారు.