ఏపీ రాజధాని భూ కుంభకోణంలో మరో ఉద్యోగి అరెస్ట్: నాలుగు నెలలుగా లీవ్లోనే..
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూకుంభకోణం కేసులో మరో సీఆర్డీఏ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెక్కల్లు సీఆర్డీఏ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన రణధీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూకుంభకోణం కేసులో మరో సీఆర్డీఏ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెక్కల్లు సీఆర్డీఏ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన రణధీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నాలుగు నెలలుగా విధులకు హాజరుకాకుండా అతను లాంగ్ లీవ్లో ఉన్నాడు. డిప్యూటీ కలెక్టర్ మాధురి వద్ద అతను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. ఈ కేసులో నాలుగు రోజుల క్రితం డిప్యూటీ కలెక్టర్ మాధురిని అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రాజధాని ప్రాంతంలోని నెక్కల్లు గ్రామంలో 2016 లో ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు డిప్యూటీ కలెక్టర్ అభియోగాలున్నాయి.
Also Read:సంచలనం...విజయవాడలో మహిళా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ చేసి అక్రమంగా భూమి బదలాయింపు జరిగినట్లు నిర్దారించింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి పంపిన సిట్ అధికారులు తాజాగా డిప్యూటీ కలెక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు మొదలు విచారణ, చార్జిషీట్ వరకు అధికారాలు కట్టబెడుతూ ఈ సిట్ ను ఏర్పాటు చేశారు.
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేసేందుకు ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీఆర్డీఎ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అమరావతి విషయంలోనే కాకుండా ఇతర ప్రాజెక్టులపై కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
Also Read:జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్... సీఆర్డీఏ పై కీలక ఆదేశాలు
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సాక్షులను విచారించడంతో పాటు చార్జిషీట్ కూడా సిట్ దాఖలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు పలువురు చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది.
అమరావతిలో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. పలువురు బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని వారు భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.