ఏపీలో ప్రజారవాణా అభివృద్ధికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, మచిలీపట్నం-గుడివాడలో మొదటి విడత అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా సేవల్లో మెరుగుదల కోసం కొత్త కొత్త చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలును ప్రారంభించడంతో పాటు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించి, పీఎం ఈ-బస్ సేవా పథకం కింద బస్సులు పొందేందుకు ప్రయత్నించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ప్రయత్నాలకు ఫలితం దక్కింది. తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనుంది. ఈ పథకం ప్రారంభ దశలో మచిలీపట్నం, గుడివాడ పట్టణాలను ఎంపిక చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రెండు పట్టణాల జనాభా మూడు లక్షల మార్కును దాటి ఉంది. కాబట్టి మొదటి విడతగా ఇక్కడ ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

ప్రస్తుత అవసరాల ఆధారంగా మచిలీపట్నం, గుడివాడకు మొత్తం 95 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అందుకుగాను ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసి, ఆయా డిపోలకు అవసరమైన వాహనాల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది.

మరోవైపు మచిలీపట్నం పట్టణం గత కొన్నేళ్లలో విస్తృతమవుతోంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి నేపథ్యంలో త్వరలోనే మరిన్ని పరిశ్రమలు అక్కడ స్థాపించే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇదే విధంగా గుడివాడ పట్టణం కూడా పారిశ్రామిక రంగంలో ముందుకు సాగుతోంది.

ఈ రెండు పట్టణాల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచాలన్న ఉద్దేశంతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ బస్సులు అందుబాటులోకి రాగానే ప్రజలకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందుబాటులోకి వస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.