చంద్రుడిపై రెండెకరాలు భూమిని తన కూతుళ్లు కోసం కొనుగోలు చేసాడు తెలుగు ఎన్నారై. 2005 లోనే భూమిని కొన్న ఎన్నారై చంద్రయాన్ 3 తో తాను చంద్రుడిపై వెళతానన్న ఆశలు పెరిగాయని అంటున్నాడు.
విజయవాడ : 'చందమామ రావే... జాబిల్లి రావే' అంటూ తమ బిడ్డలకు అన్నం తినిపిస్తూ పాడుకునేవారు ఆనాటి తల్లులు. కానీ ఈతరం తల్లులు మాత్రం 'చందమామ పైకి వెళదామా... అక్కడే వుందామా' అని పాడుకునే పరిస్థితి వుంది. 'చంద్రయాన్-3' సక్సెస్ తో మంచి జోరుమీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడుపైకి మనుషులను పంపించే ప్రాజెక్ట్ కు సిద్దమయ్యింది. ఇలా చంద్రుడిపై మానవ నివాసంపై అనుకూల పరిస్థితుల గురించి ప్రయోగాలకు సిద్దమవుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ జోరందుకోగా భూముల కొనుగోలుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తెలుగు ఎన్నారై ఒకరు తన కూతుళ్ల పేరిట చంద్రమండలంపై రెండెకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన బొడ్డు జగన్నాథ్ రావు ఉద్యోగరిత్యా అమెరికా వెళ్ళాడు. ఈ సమయంలోనే చంద్రుడిపై భూములు అమ్ముతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. కానీ భవిష్యత్ ను ముందుగానే ఊహించిన ఆయన చంద్రుడిపై నివాసం సాధ్యమేనని నమ్మాడు. దీంతో 2005 సంవత్సరంలోనే చంద్రుడిపై భూములు అమ్ముతున్న లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీని సంప్రదించాడు.
న్యూయార్క్ లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చంద్రుడిపై భూముల అమ్మకం గురించి పూర్తి వివరాలు తెసుకున్నారు ఎన్నారై జగన్నాథ రావు. వెంటనే తన ఇద్దరు కూతుళ్ల పేరిట చంద్రుడిపై రెండెకరాలు భూమిని కొనుగోలు చేసాడు. ఈ భూమికి సంబంధించిన ల్యాండ్ పార్సిల్ నంబర్లు, వివిధ అంతర్జాతీయ పరిశోధన సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను పేర్కొంటూ రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్ ను అతడికి అందించారు. అంతేకాదు చంద్రుడిపై పరిశోదన సంస్థలు తీసిన వీడియోలతో పాటు ఏయే అక్షాంశ, రేఖాంశాల మధ్య ఇతడి రెండెకరాల భూమి వుందో కూడా స్పష్టంగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది లూనార్ రిపబ్లిక్ సొసైటీ.
వీడియో
తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'చంద్రయాన్-3' విజయవంతం కావడంతో జగన్నాథరావు చంద్రుడిపై భూమికొన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇస్రోతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు చంద్రమండలంపైకి మానవులను పంపించే పరిశోధనకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై తనకు కూడా కాలు మోపాలని వుందన్న ఆశను జగన్నాథరావు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోరికతోనే చంద్రుడిపై ఎన్నో సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసానని తెలిపాడు. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత తన కోరిక త్వరలోనే నెరవేరుతుందన్న ఆశాభావాన్ని జగన్నాథరావు వ్యక్తం చేసారు.
