జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ... రాజధాని తరలింపు పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్ ను కూడా న్యాయస్ధానం తిరస్కరించింది.
ఆంధ్ర ప్రదేశ్ : మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా పరిపాలనను విశాఖపట్నం నుండి చేపట్టేందుకు సిద్దమైన జగన్ సర్కార్ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా రాష్ట్ర హైకోర్ట్ షాకిచ్చింది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే ప్రక్రియపై స్టేటస్ కో విధించిన న్యాయస్థానం తాజాగా అత్యవసర విచారణ చేపట్టేందుకు తిరస్కరించింది. స్టేటస్ కో ను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలుచేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని... అందువల్ల మంగళవారమే విచారణ చేపడతామని న్యాయస్ధానం స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం తరలింపు వ్యవహారంపై దాఖలుచేసి రిట్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం విశాఖలో నిర్వహించాల్సిన మీటింగ్స్ కు కోర్టు ఆదేశాల కారణంగా అంతరాయం ఏర్పడతోందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కానీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించారు.
ఇవాళ కాకుంటే కనీసం రేపయినా(శుక్రవారం) లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కానీ అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని... మంగళవారమే వాదనలు వింటామని స్పష్టం చేసింది.
Also Read నేడు డిల్లీకి వైఎస్ షర్మిల ... కాంగ్రెస్ లో చేరడానికేనా?
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం క్యాంప్ కార్యాలయాలను మాత్రమే తరలిస్తున్నామంటూ అపిడవిట్ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్ పై విచారణను సింగిల్ బెంచ్ నుండి త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసారు. కానీ ఇంకా ఏ బెంచ్ విచారణలో జరపాలో నిర్ణయించలేదు... త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి దీనిపై నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెల్లడించేవరకు స్టేటస్ కో కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది.
కాగా.. సీఎం ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గత నెలలో విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. నగరంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది . విశాఖ రిషికొండపై వున్న మిలీనియం టవర్స్లో మంత్రులు , అధికారుల క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ గుర్తించింది.
మిలీనియం టవర్స్లోని ఏ, బీ టవర్స్ను ఇందుకోసం కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని.. అలాంటి వెసులుబాటు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్ను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్లోని ఏ, బీ టవర్స్లను కేటాయిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది.