అన్ని రంగాల్లో అధోగతి.. మోడీకి జగన్ దత్తపుత్రుడు: వైకాపా, బీజేపీ ప్రభుత్వాలపై చింతా మోహన్ ఫైర్
Vijayawada: అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని పేర్కొన్న ఆయన.. వైకాపా, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా మోహన్ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని అన్నారు. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని పేర్కొన్న ఆయన.. వైకాపా, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర ఘాటు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని అధ్వాన్నంగా మార్చగా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు, దేశానికి చేసిందేమీ లేకపోగా.. సామాన్య ప్రజల జీవితాలను మరింత భారంగా మార్చిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కాదు అబద్దాల ప్రదేశ్ గా మార్చారు..
రాష్ట్రలోని వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అబద్ధాల ప్రదేశ్గా మార్చిందని చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రగతి కుంటుపడిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే అధ్వానస్థితికి రాష్ట్ర ప్రగతి చేరిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు సృష్టించారని మండిపడ్డారు. అమరావతి కోసం రాష్ట్ర రైతులు, ప్రజలు చేస్తున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను సైతం ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో రైతులు, సాధారణ పౌరులతో కలిసి మహిళలు సైతం రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారని తెలిపారు. వైకాపా పాలన రాష్ట్రంలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరిగిపోతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఆకలి మంటలు
ముఖ్యమంత్రి జగన్మోహర్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన చితా మోహన్.. రాష్ట్రంలో ఆకలిమంటలు చుట్టుముట్టాయని అన్నారు. చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 60కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కోటి మంది, అదే విజయవాడలో 2 లక్షల మంది ఆకలి కొరల్లో చిక్కుకుని ఉన్నారని చెప్పారు. కనీసం ఒక్కపూట కూడా తినడానికి తిండిలేని ప్రజలు ఉండటమా? సీఎం జగన్ చెప్పే రాజన్న రాజ్యం? అంటూ ప్రశ్నించారు. విద్యా రంగాన్ని పట్టించుకోకుండా.. విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ ఛార్జీలు కూడా ఇవ్వకుండా ఆయన తండి ఆశయాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు.
ముందుకు సాగని పోలవరం నిర్మాణం
పోలవరం పేరుతో రాష్ట్ర ప్రజలను సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నదని అన్నారు. ఇప్పటికీ పోలవరం పనులు ముందుకు సాగకుండా కుంటు పడ్డాయని పేర్కొన్నారు. అలాగే, అమరావతి మొండి గోడలుగా మారిందని అన్నారు. ఆర్థిక అసమానతలు సైతం రాష్ట్రంలో పెరుగుతున్నాయని పేర్కొన్న చింతా మోహన్.. పేదలు రోజుకు రూ.100 కూడా సంపాదించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. ఇదే సమయంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. చట్ట సభల సాక్షిగా కూడా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
మోడీకి జగన్ దత్తపుత్రుడు
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ది జరిగిందని పేర్కొన్న చింతామోహన్.. వైకాపా, బీజేపీ పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోడీ దత్తపుత్రుడంటూ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజా సొమ్మును అదానీకి దొచిపెడుతున్నారని ఆరోపించారు. పేదలను పరిస్థితులను మరింత దిగజార్చిన మోడీ సర్కారు.. చిరుతలను తెచ్చి ఫొటోలతో గొప్పలు చేప్పుకుంటున్నదనీ, ఇదేనా మీరు సాధించిన ప్రగతి? అంటూ ప్రశ్నించారు.