వాతావరణం అనుకూలించని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సూళ్లూరు పేట పర్యటన వాయిదా పడింది.  అయితే  మత్య్సకారులకు నిధులను క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేశారు సీఎం జగన్.

అమరావతి:ఓఎన్‌జీసీ పైప్ లైన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు నిధులను విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు .విశాఖ షిప్పింగ్ హర్బర్ లో బోట్లు కాలిపోయిన కుటుంబాలను ఆదుకొంటామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బోటు విలువ లెక్కగట్టి 80 శాతం నిధులను ప్రభుత్వమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సీఎం చెప్పారు. ఈ చెక్కులను ఇవ్వాలనే ఆదేశించామని జగన్ తెలిపారు. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడే మార్గం ఉంటుందన్నారు. నెలకు రూ. 11, 500 చొప్పున ఆరు మాసాలకు రూ. 69 వేలను ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి ఇవాళ జమ చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. నాలుగో విడతలో రూ.161 కోట్లు కలుపుకుంటే రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు ఇచ్చామని సీఎం జగన్ వివరించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం మత్య్సకారులకు చిల్లిగవ్వ ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. 

ఇవాళ సూళ్లూరు పేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. సూళ్లూరు పేటలో పులికాట్ సరస్సు ముఖద్వారం పునరుద్దరణ పనులు, రాయదరువు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ తదితర పనుల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణం సహకరించని కారణంగా ఈ కార్యక్రమంలో జగన్ పర్యటన వాయిదా పడింది. 

ఇదే కార్యక్రమంలో ఓఎన్‌జీసీ పైప్ లైన్ తో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేశారు.