ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024: జగన్ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.
![Andhra Pradesh Budget 2024: Andhra Pradesh Cabinet Approves Interim Budget lns Andhra Pradesh Budget 2024: Andhra Pradesh Cabinet Approves Interim Budget lns](https://static-ai.asianetnews.com/images/01gvm9kftd4k2x1wdwvgrj1112/ap-cabinet-meeting-jpg_363x203xt.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి అమర్ నాథ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టవు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతాయి. ఈ సంప్రదాయం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది.
also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన: తొమ్మిది మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక శాఖను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను దాదాపుగా అమలు చేసిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారిత,వ్యవసాయానికి పెద్దపీట వేసినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా సీఎం భావించారన్నారు.