ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన: తొమ్మిది మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ సభ్యుల ఆందోళనతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారని టీడీపీ సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు.
![Nine TDP MLAs Suspended From Andhra pradesh Assembly lns Nine TDP MLAs Suspended From Andhra pradesh Assembly lns](https://static-ai.asianetnews.com/images/01dw98ga73mvr2wbq6ybrkve6j/tammineni-seetaram-jpg_363x203xt.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రైతు సమస్యలపై చర్చించాలని తెలుగు దేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా బుధవారం నాడు అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
also read:నేను రిటైర్ కావడం లేదు: ఏపీ అసెంబ్లీ లాబీల్లో పేర్నినాని, గోరంట్ల మధ్య ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. సభ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల తీరుపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామనాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయస్వామిలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
also read:నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్
మంగళవారంనాడు కూడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే.ఇష్టంలేని వాళ్లను కూడా పిలిపించి మరీ గొడవ చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సస్పెన్షన్ గురైన టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే నిలబడి నినాదాలు చేశారు.