‘‘చంద్రబాబు తన వీరత్వం చూపాలనుకున్నారు’’
మీడియాతో అంబటి రాంబాబు
నాయిని బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగటం దారుణమని ఆయన మండిపడ్డారు.
నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులని, అలాంటి వారిపై చంద్రబాబు వీరత్వం చూపాలనుకున్నారని తప్పుబట్టారు. ‘కేంద్రంపై పోరాటమంటూ వారంరోజులుగా చంద్రబాబు తెగ ప్రచారం చేసుకున్నారు. చివరకు ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు చంద్రబాబు నాయి బ్రాహ్మణుల మీద పడ్డారు. ప్రజాదేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవునిలా లేదు.ఆయన పది తలలున్న పెద్ద రాక్షసుడు’ అని అంబటి దుయ్యబట్టారు.
జాలర్లు, బ్రాహ్మణుల మీద కూడా ఆయన దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. వివిధ వర్గాల ప్రజల ఉద్యమాలను అణచివేయడం తప్ప వారి సమస్యలను చంద్రబాబు ఎప్పుడైనా పరిష్కరించారా? నిలదీశారు. నాయి బ్రాహ్మణులను రాత్రి పిలిపించి బలవంతంగా సమ్మె విరమింపచేశారని పేర్కొన్నారు.
ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పచ్చచొక్కా వేసుకోవడం మంచిదని, ఆయనకు మహానాడులో సన్మానం చేయాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయటం, అసంతృప్తవాదులను సీఎం దగ్గరకు తీసుకెళ్లటమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.