‘‘జగన్ అలా అనలేదు.. ముద్రగడ వ్యాఖ్యలు బాధాకరం.. జగన్ వెనకడుగు వేయడు’’
జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ అధినేత చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి.. కొన్ని శక్తులు రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర పన్నాయని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు
జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ అధినేత చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి.. కొన్ని శక్తులు రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర పన్నాయని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు.
కేవలం కాపు రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని మాత్రమే జగన్ వ్యాఖ్యానించారని.. కాపు రిజర్వేషన్కు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.. హామీ ఇస్తే జగన్ వెనక్కి తీసుకునే రకం కాదని.. ఈ అంశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటామని రాంబాబు తెలిపారు. ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని.. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇవాళ్టీ వరకు కాపు రిజర్వేషన్ అంశం ఎందుకు పెండింగ్లో ఉందన్నారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ వేసి నివేదిక పరిశీలించకుండా హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు.. ఈ అంశంపై కేవలం ముగ్గురు సభ్యులు ఇచ్చిన రిపోర్టునే కేంద్రానికి పంపారన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులను కూడా కాపులకు కేటాయించలేకపోయారని అంబటి రాంబాబు ఆరోపించారు.
కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే తలుపులు పగలగొట్టి ఆయనను.. పద్మనాభం కుటుంబసభ్యులను కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చారని.. ఆ సమయంలో ముద్రగడ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తి జగనే అని గుర్తు చేశారు.