రాజధానిని మూడుముక్కలు చేసే అధికారాన్నిచ్చింది వారే...: అమర్నాథ్ రెడ్డి
రాజధాని విషయంలో మూర్ఖంగా వ్యవహరించడమే గానీ అధికార పార్టీ నేతలకు ప్రజామోదం అక్కరలేదా? అని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి అని ప్రశ్నించారు.
అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్ళేందుకు మేం సిద్ధంగా ఉన్నామని...మీరు సిద్దమా అంటూ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులకు సవాల్ విసిరారు. రాజధాని విషయంగా తమ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్ పై సిఎం జగన్ ఒక్క మాటైనా మాట్లాడక తమ భజన పార్టీచే మాట్లాడించడంతోనే వారి చిత్తశుద్ధి తేటతెల్లమైందన్నారు.
రాజధానిని మూడు ముక్కలు చేసి ఐదు కోట్ల ఆంధ్రుల జీవితంతో చెలగాటమాడడానికి అధికారాన్ని అందించింది ఆ ప్రజలేననే విషయాన్ని వైసిపి గుర్తించాలన్నారు. అదే ప్రజలు సరైన సమయంలో మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
read more మూడు రాజధానులు: జగన్ చేసింది అదే, చంద్రబాబు టార్గెట్ బిజెపి
రాజధాని విషయంలో మూర్ఖంగా వ్యవహరించడమే గానీ అధికార పార్టీ నేతలకు ప్రజామోదం అక్కరలేదా? అని ప్రశ్నించారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినపుడు, మీరు తీసుకునే నిర్ణయాలపై కనీసం ప్రజాభిప్రాయం కోరకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ నిర్ణయాలుండాలని, మూడు రాజధానులు చేస్తామనే అజెండాతో నాడే ఎన్నికలకు రావాల్సిందన్నారు.
వ్యక్తిగత, రాజకీయ కక్షలతో భవిష్యత్తు తరాల వారి జీవితాలతో ఆడుకోవద్ధని, అది ఏమాత్రం మంచిది కాదన్నారు. మూర్ఖంగా మొండిగా ముందుకెళితే మాత్రం భవిష్యత్తులో చరిత్ర హీనులుగా నిలిచి పోతారని అన్నారు. అయినా తాము కోరుతున్నట్లు ప్రజాకోర్టుకు వెళ్ళేందుకు భయమెందుకో ప్రజలకు తెలపాల్సిన అవసరముందని అమర్నాథ్ రెడ్డి అన్నారు.