అమర్రాజా ఫ్యాక్టరీలో తనిఖీల నివేదిక ఇవ్వండి: ఏపీ హైకోర్టు ఆదేశం
అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో ఆరు వారాలకు ఏపీ హైకోర్టు పొడిగించింది.కాలుష్య నియంత్రణ మండలి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ . మోహన్ రెడ్డి, అమర్ రాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
అమరావతి: అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో ఆరు వారాలకు పొడిగిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్బీ , జస్టిస్ కె. సురేష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అమరరాజా పరిశ్రమలో పీసీబీ అధికారులు, ఐఐటీ మద్రాస్ నిపుణులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన నివేదికను న్యాయస్థానం ముందుంచాలని కాలుష్య నియంత్రణ మండలిని (పీసీబీ)ని హైకోర్టు ఆదేశించింది.పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతంపై పరీక్షలు చేసేందుకు పీసీబీ అధికారులకు సహకరించాలని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి హైకోర్టు సూచించింది.
పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగుల గోపినాథ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాలుష్య నియంత్రణ మండలి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ . మోహన్ రెడ్డి, అమర్ రాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.