రుణమాఫీ జరగలేదని వృద్ధ దంపతుల ఆతహత్య
ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీ ఎంతకు జరగకపోవడం.. తీసుకున్న రుణం కట్టాలని బ్యాంకు నోటీసులు పంపడంతో.. మనస్తాపానికి గురైన వృద్ధ జంట ఆత్మహత్యకు పాల్పడింది
ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీ ఎంతకు జరగకపోవడం.. తీసుకున్న రుణం కట్టాలని బ్యాంకు నోటీసులు పంపడంతో.. మనస్తాపానికి గురైన వృద్ధ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయయ్య దంపతులు తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.
గతంలో వ్యవసాయం కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి రూ. 1.46 లక్షల రుణం తీసుకున్నారు. అయితే కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పడం.. 2016లో రుణ విమోచన పత్రాన్ని సైతం బ్యాంకు అధికారులు రామయ్యకు ఇవ్వడంతో.. తన రుణం మాఫీ అవుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
అయితే నాలుగేళ్ల నుంచి రుణమాఫీ జరగకపోవడం.. తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు వస్తుండటంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.
మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.