జగన్ కు నిజమైన పరీక్ష
- వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి 8వ రోజు అసలైన పరీక్ష ఎదురవుతోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి 8వ రోజు అసలైన పరీక్ష ఎదురవుతోంది. ఎందుకంటే, 6వ తేదీ యాత్ర మొదలైన దగ్గర నుండి మంగళవారం ఉదయం వరకూ సొంత జిల్లా కడపలోనే ప్రజాసంకల్పయాత్ర సాగింది. కడప ఎటూ సొంత జిల్లానే కాబట్టి జన సమీకరణ విషయంలో పార్టీ నేతలకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కాబట్టి పాదయాత్ర బ్రహ్మండమని సంబరపడుతున్నారు.
కానీ మంగళవారం ఉదయం కడప-కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని చాగలమర్రి మండలం గుండా కర్నూలు జిల్లాలోకి జగన్ ఎంటర్ అవుతున్నారు. జన సమీకరణ విషయంలో జిల్లా నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో మెజారిటీ ఎంఎల్ఏలు వైసీపీ తరపున గెలిచినా తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. కాబట్టి పలు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు ఎవరు అన్న విషయం తేలిపోతుంది. జిల్లాలోని మొత్తం 7 నియోజకవర్గాల్లో 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. ఆళ్ళగడ్డ, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు తదితర నియోజకవర్గాలునాయి.
దానికితోడు నియోజకవర్గాల్లో బలమైన నేతల్లో ఒకరుగా పేరున్న చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురవ్వటంతో పాటు మొన్నటి నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా జిల్లాలోని కొందరు నేతలు టిడిపిలో చేరారు. దాంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ కొరత ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ పాదయాత్రను మొదలుపెట్టారు. అందులోనూ ఈరోజు కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. జన సమీకరణ విషయంలో కర్నూలు జిల్లా నేతలు ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి?