స్టేషన్లో ‘విధి’ని వదిలేసి... ఆస్తులు వెనకేసుకోవడమే ‘విధి’.. హెడ్ కానిస్టేబుల్ ఆస్తి రూ.7 కోట్ల పై మాటే
కొద్దిరోజుల క్రితం రవాణాశాఖకు చెందిన కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు అతను కూడబెట్టిన ఆస్తులు చూసి కళ్లు బైర్లుగమ్మాయి. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన మరచిపోకముందే కడప జిల్లాలో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు
కొద్దిరోజుల క్రితం రవాణాశాఖకు చెందిన కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు అతను కూడబెట్టిన ఆస్తులు చూసి కళ్లు బైర్లుగమ్మాయి. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన మరచిపోకముందే కడప జిల్లాలో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.. ఇతను కూడా కానిస్టేబులే కాకపోతే హెడ్ కానిస్టేబుల్..
ప్రొద్దుటూరు, బ్రహ్మంగారి మఠం పీఎస్లలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన వీరయ్యపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులకు దిగింది. ఈ సోదాల్లో ఆయన సంపాదించిన అక్రమ సంపాదన చూసి షాకయ్యారు. పోలీస్ స్టేషన్లో అధికారులు అందుబాటులో లేనప్పుడు అంతా తానై చూసుకోవాల్సిన హెడ్ కానిస్టేబుల్ వీరయ్య తన విధిని గాలికి వదిలేసి.. ఆస్తులు కూడబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టాడు.
అందినకాడికి దోచుకుంటూ వడ్డీలకు తిప్పాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇతరులను నొప్పించకుండా వారి ఇష్టంతోనే లంచాలను దండుకోవడంలో వీరయ్యకు సాటిలేరని సిబ్బంది చెబుతూ ఉంటారు.
అలా ప్రొద్దుటూరులో ఆరు సెంట్ల స్థలం రెండిళ్లు, ఐదు సెంట్లలో విలాసవంతమైన భవంతి, మరో ఇల్లు, చాపాడు మండలం చీపాడులో మూడున్నర ఎకరాల పొలం, ప్రొద్దుటూరు పట్టణంలో ఒక సంగీత వాయిద్యాల దుకాణం.. నగదు, బంగారు వస్తువులు, రాయల్ ఎన్ఫీల్డ్ను గుర్తించారు.. వీటన్నింటి విలువ సుమారు రూ.7 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవే గాక కడప, బెంగళూరుతో పాటు జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో వీరయ్యకు ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది..