క్రికెట్ బుకీలతో లింక్స్: వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డిపై బిగిస్తున్న ఉచ్చు
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఉచ్చు బిగిస్తోంది.
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఉచ్చు బిగిస్తోంది. క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆయన మీద ఎసీబీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మరింతగా దర్యాప్తుపై దృష్టి పెట్టారు.
క్రికెట్ బుకీలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచాడనే ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డి పలు మార్లు విజయవాడలోని వివిధ హోటళ్లలో సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై నెల్లూరు ఎస్పీ రామకృష్ణ డిజిపి మాలకొండయ్యకు ఓ నివేదిక సమర్పించారు.
దాంతో పూర్తి స్థాయి విచారణ జరపాలని సూచిస్తూ మాలకొండయ్య ఎసిబీ డీజీ ఠాగూర్ కు ఓ లేఖ రాశారు. తనకు సహకరించినందుకు కృష్ణ సింగ్ అనే బుకీ విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా రూ.23 లక్షలు కోటంరెడ్డికి ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కృష్ణసింగ్ కు కొన్నాళ్లు దాక్కోవడానికి కోటంరెడ్డి సహకరించారని, అంతే కాకుండా పోలీసు స్టేషన్ లో లొంగిపోవడానికి సహకరించారని అంటున్నారు. హోటళ్లకు సంబంధించిన బిల్లులను, ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. అయితే ఆ ఆరోపణలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండిస్తున్నారు.