ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

అమరావతి: ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు అనుమతించింది. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలేం జరిగిందంటే.. ఏబీ వెంకటేశ్వరరావు జూన్ 6న విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన ఆర్జిత సెలవుల (ఈఎల్) ఆమోదం కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తుపై డీజీపీ గానీ, సీఎస్ గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే తన దరఖాస్తుపై సీఎస్, డీజీపీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసుకున్న దరఖాస్తుపై జూన్ 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (సీఎస్‌), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 21 రోజుల కంటే ముందు దరఖాస్తు సమర్పించినప్పుడు ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏబీ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే తన ఆభ్యర్థనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించడంతో.. ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.